🌺 సోమవారం అమావాస్య
సోమవారం + అమావాస్య కలిసే రోజున ఆడవారు సౌభాగ్యం కోసం "అమాసోమవార వ్రతం" చేసుకుంటారు.
ఇక ఆ సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘ సోమవతీ అమావాస్య ’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు.
సోమవారం రోజున తెల్లవారు ఝామున లేచి దేవాలయలంలో రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి దీపారధన చేసి. చెట్టు మూలాన్నినిళ్ళతో తడిపి పద్మం ముగ్గు పెట్టి , చెట్టుకి గంధం కలిపిన నీలు పోస్తూ మొదటి ప్రదక్షిణ చేసుకోవాలి తరువాత 108 ప్రదక్షిణలు చేయాలి.
క్రింది (మూలతో బ్రహ్మ... అనే) శ్లోకం చదువు కుంటూ ప్రదక్షిణ చేయాలి. నిత్య సౌభాగ్యవతిగ దీవించమని వేడుకోవాలి. తరువాత ముతయిదువులకి పండు తాంబూలం ఇవ్వాలి.
🥀 వ్రత కథ 🥀
అనగనగా ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.ఆ కూతురి వివాహాంలో సన్నికల్లు మీద కాలు తొక్కే వేళ వైధవ్యం ప్రాప్తిస్తుందని, ఆ బాలికను సప్తసముద్రాలకు అవతల ఉన్న చాకలి పోలి వద్దకు తీసుకువెడితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వలన ఆ పిల్ల పెద్దన్న గారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు.
అన్నాచెల్లెళ్ళిద్దరు సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు క్రిందనిలబడి, “సముద్రాలను దాటడమెలాగా?” అని దిగాలుపడి ఉండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మద్యన పడింది.. అన్నాచెల్లెళ్ళిద్దరు ఆ పండుని తినడంతో వారి ఆకలి దప్పులిట్టే మాయమయ్యాయి. అనంతరం అదే చెట్టుమీదనుండి ఒక గండభేరుండ పక్షి దిగి వచ్చి వాళ్ళిద్దరిని తన వెన్నుమీద కూర్చోబెట్టుకుని సప్తసముద్రాల అవతల ఉన్న చాకలిపోలి వాకిట్లో దింపి ఎటొ ఎగిరిపోయింది.
అది మొదలు అన్నాచెల్లెళ్లు చాకలి పోలి వాకిలి తుడిచి ,కల్లాపి చల్లి క్రొత్త క్రొత్త ముగ్గులు పెడుతూ,దగ్గరలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగారు.తను నిద్రలేచేసరికి తన వాకిలి కల్లాపుతోనూ,రకరకాల ముగ్గులతోనూ కళకళలాడుతుండటం చూసిన చాకలిపోలి అలా చేస్తున్నదెవరో కనిపెట్టాలని కాపుకాసి,ఒకనాడు అన్నాచెల్లెళ్ళను కనిపెట్టింది,”ఎవరు మీరు? నా వాకిలినెందుకు ఊడుస్తున్నారు ? మీకేం కావాలి ?” అని అడిగింది.అందుకు అన్నగారు తన చెల్లెలి విషయంలో దైవజ్ఞుడు చెప్పినది వినిపించి,ఆమెను వైధవ్యం నుండి తప్పించవలసిందిగా కోరాడు. చాకలిపోలి సమ్మతించి,తన ఏడుగురు కోడళ్లని పిలిచి,తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి,ఆ అన్నాచెల్లెళ్లతో బయల్దేరింది.ఆమె దివ్యశక్తితో సప్తసముద్రాల్ని దాటి,వాళ్ల ఇంటికి చేరి పిల్లకి పెళ్ళి చేయమంది పోలి .పెళ్ళి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్ళికొడుకు మరణించాడు. వెంటనే చాకలిపోలి తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి ధారపోసి అతనిని మళ్ళి బ్రతికించాడు.అది చూసి అందరు ఆశ్చర్యపోయారు.ఆమె నెంతగానో స్తోత్రం చేశారు.కాని తన నోము ఫలాన్ని ధారపోయడం వలన,ఇంటి వద్దనున్న ఆమె ఏడుగురు కొడుకులు మరణించారు.ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయల్దేరింది. దార్లో కనిపించిన రావి చెట్టును చూసి,108 గువ్వరాళ్లని ఏరి పట్టుకుని ఆ చెట్తుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసింది.ఇక్కడిలా చెయ్యగానే,అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నారు.
పోలి ఇంటికి చేరాక,ఏడుగురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి,జరిగిన అద్బుతానన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా,చాకలిపోలి వారితో అదంతా సోమవతి అమావాస్య వ్రత ఫలమని అని చెప్పి వారి చేత ఆ వ్రతాన్నిఆచరింపచేసింది.
విధానం:
ఒకానొక అమావాస్యతో కూడిన సోమవారం నాడు నోమును ప్రారంభించాలి. అశ్వత్థ(రావి) వృక్షానికి నమస్కరించి దిగువ శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణం చెయ్యాలి.
శ్లోకం:
మూలతో బ్రహ్మరూపాయ మద్యతో విష్ణురూపిణే|
అగ్రత శ్శివరూపాయ వృక్షరాజాయతే నమ: ||
అలా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పున 108 సార్లు శ్లోకం చదువుతూ,నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి.చివర్లో ఒక పండోఫలమో చెట్టు మొదలులో ఉంచి నమస్కరించాలి. అలా 108 అమావాస్య సోమవారాలయ్యాక ఉద్యాపన చేసుకోవాలి.
ఉద్యాపన:
అలా 108 వ అమావాస్యా సోమవారం నాడు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత,వృక్షమూలంలో భియ్యంతో మండపం ఏర్పరిచి శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపంలో ఉంచి ఆరాధించాలి. ముత్తయిదువలకు ఫలాలను వాయనదానమివ్వాలి.
🥀 మరొక కథ కూడా ఉంది 🥀
దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.
సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు.
నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ... ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు.
శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి... తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.
సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే... సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏదీ కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి